రైతులను మోసంచేస్తే తస్మాత్ జాగ్రత్త
నకిలీ ఎరువులు, విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తాం
షీ టీమ్స్ పనితీరు భేష్
వరంగల్కు పోలీస్ కమిషనరేట్
సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి):
వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వరకే పరిమితం కాకుండా వాటి నిలువ కోసం కూడా మార్కెటింగ్ శాఖ ప్రణాళికబద్దంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రశేఖర్రావు అన్నారు. రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందించేందుకు ముందుగానే నిలువ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సచివాలయంలో మార్కెటింగ్శాఖ మంత్రి హరీష్రావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య , అధికారులు ప్రియదర్శిని, లక్ష్మిబాయి తదితరులతో మార్కెట్ శాఖను సమీక్షించారు.రాష్ట్రంలో ఏడాదికి ఎన్ని లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి, ఎన్ని టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి, ఎక్కడ వాటి అవసరముంధి అన్న విషయాలపై అధ్యయనం చేసి అవసరమైనమేర నిర్మాణం చేపట్టాలని సూచించారు. కేవలం ధాన్యం కాకుండా ఎరువులు, విత్తనాల కోసం కూడా గోదాములు ఉపయోగించాలని సీఎం సూచించారు. ఎరువుల కోసం ప్రతిసారి రైతులు రోడ్డెక్కడం పరిపాటైందని. ఈ పరిస్థితి మారాలంచే అంచనాలు సకాలంలోవేసి వాటిని తెప్పించి నిల్వ వేసుకోవాలని అన్నారు. ఎండాకాలంలో ఎరువుల, విత్తనాల నిల్వ, వర్షాకాలం తర్వాత పంటల నిల్వ చేసుకోవటానికి గోదాములు ఉపయోగించాలని సూచించారు. ఇక కల్తీ, ఎరువులు, విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అవకతవకలు జరిగితే కఠినంగా వ్యవహరించాలన్నరు.
మార్కెటింగ్శాఖపాటు పోలీసుశాఖ పనితీరుపై సమీక్ష జరిపిన కేసీఆర్ షీటీమ్స్ పనితీరు బాగుందని కితాబిచ్చారు. వరంగల్కు పోలీస్ కమిషనరేట్ హోదా పై ఆదేశాలివ్వటం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ నగరానికి ఎప్పుడో కమిషనరేట్ రావాల్సి ఉందిందన్నారు.