రోజూ యోగా చేయండి

కరీంనగర్‌ : ఆర్యోగంగా, ఆనందంగా జీవనాన్ని సాగించడానికి ప్రాణయామం, యోగాను దినచర్యలో భాగంగా చేయాలని కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే, పద్మనాయక వెలమల సంఘం అధ్యక్షుడు కఠారి దేవేందర్‌రావు తెలిపారు. స్వామి వివేకనందా 150వ జయంత్యుత్సవాల సందర్భంగా శాతవాహన లయన్స్‌ క్లబ్‌, ప్రజ్ఞాభారతి కరీంనగర్‌ సంయుక్తంగా పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న 365 రోజుల యోగా శిబిరానికి దేవేందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పని ఒత్తిడిలో జీవితం యాంత్రికంగా మారిపోతున్నందున, యోగా, ప్రాణాయామం, ధ్యానం అవసరమని పేర్కొన్నారు. ఇంటింటా యోగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని పిలుపునిచ్చారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న చీటి రామారావు, తుమ్మల రమేష్‌ రెడ్డి, శాతవాహన లైన్స్‌క్లబ్‌ అధ్యక్షులు, కార్యదర్శి డి.నిరంజానాచారి, మనోహరాచారి, ఎలుగందుల సత్యనారాయణ మాట్లాడుతూ 365 రోజుల ఈ శిబిరాన్ని కరీంనగర్‌ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, సూర్యారావు, గంగారావు, యోగా గురువు ఎర్రోజ్వల ప్రభాకర్‌శర్మలతోపాటు యోగా సాధకులు పాల్గొన్నారు.