వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు

స్థలపరిశీలన చేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): టిఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్‌ 15 న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఏర్పాట్లకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపనేని రమేశ్‌లతో కలిసి పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శనివారం స్థల పరిశీలన చేశారు. వరంగల్‌ మామునూరు లోని స్థలాన్ని మంత్రి పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్‌ స్థలం, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇతరత్రా ఇంకా ఏమైనా స్థలాలు ఉన్నాయా? అనే విషయాన్ని కూడా మంత్రి పరిశీలిస్తున్నారు. అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అవసరమైన స్థలం అవసరమని, అందుకు అన్ని విధాలుగా అనువైన స్థలం కావాల్సి ఉందని మంత్రి అన్నారు. ఆనాటి సభకు సీఎం, పార్టీ అధ్యక్షుడు కెసీఆర్‌ హాజరై మాట్లాడతారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ఇన్నేళ్లలో పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని నివేదిస్తారని మంత్రి తెలిపారు.