వరద ముంపుకు గురైన ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన.
బూర్గంపహాడ్ జూలై జనం సాక్షి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గోదావరి ముంపునకు గురైన ప్రాంతాలను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదల వచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, మిషన్ భగీరథతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి నేతృత్వంలో పార్తిభన్ కె.మనోహరన్, కేంద్ర జలసంఘం డైరెక్టర్ రమేష్కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్ఈ శివకుమార్ కుష్వాహల కేంద్ర బృందం శుక్రవారం జిల్లాలోని స్థానిక మండలం సంజీవరెడ్డి పాలెం, స్థానిక మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. సంజీవరెడ్డి పాలెం గ్రామంలో దెబ్బతిన్న పత్తి, డ్రాగేన్ ఫ్రూట్ రైతుల పొలాలు పరిశీలించారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. జి భాస్కర్ రెడ్డి తాను15 ఎకరాలలో పత్తి పంట వేశానని వరదల వల్ల పూర్తిగా పాడైపోయినట్లు చెప్పారు. యం ఏ మజీద్ అనే రైతు యొక్క డ్రాగేన్ ఫ్రూట్ పండ్ల తోటను పరిశీలించారు. పంట పూర్తిగా నీట మునిగి కుళ్ళిపోయినట్లు అధికారులు గమనించారు. స్థానిక గ్రామంలో దెబ్బతిన్న ఇళ్ళు, కుక్కునూరు -బూర్గంపహాడ్ రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దెబ్బ తిన్న నష్టంపై నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందచేస్తాని చెప్పారు. అంతకు ముందు నష్ట పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి ఐటిడిఎ కార్యాలయంలో దెబ్బతిన్న నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. అధికారుల బృందం నష్టాలపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖకు 10831 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని, దెబ్బతిన్న పంటల విలువ 584.88 లక్షలు ఉంటుందని, ఉద్యాన వన శాఖ పంటలు 35 హెక్టార్లలో దెబ్బతిన్నాయని నష్టం విలువ 40.50 లక్షలని, విద్యుత్ శాఖకు 9 సబ్ స్టేషన్స్, 65 స్తంభాలు, 259 విద్యుత్ నియంత్రికలు దెబ్బతిన్నాయని వాటి విలువ 580.10 లక్షలని, పంచాయతి రాజ్ శాఖకు సంబంధించి గ్రామీణ రహదారులు 251.50 కిమి మేర దెబ్బతిన్నాయని వాటి విలువ 1280 లక్షలని, రహదారులు, భవనాల శాఖ కు సంబంధించి 45 చోట్ల రహదారులు దెబ్బతిన్నాయని వాటి విలువ 9996 లక్షలని చెప్పారు. మిషన్ భగీరథ 212 అవాసాల్లో నల్లాలు, మోటార్లు, ప్యానెల్ బోర్డ్స్ దెబ్బతిన్నాయని వాటి విలువ 220 లక్షలని, అలాగే జాతీయ రహదారులకు సంబంధించి 252 లక్షల నష్టం వాటిల్లిందని మొత్తం నష్టం విలువ 12953.48 లక్షలని ఆయన వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నదికి 1986 సంవత్సరం తరువాత ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి అని, ఈ నెల16 వ తేదీన రికార్డు స్థాయిలో గోదావరికి 71.30 అడుగుల వరకు వరద ఉదృతి వచ్చిందని అన్నారు. వరదలు వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. పశువులను కూడా ఎతైన ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ముంపుకు గురవుతున్న ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు కలెక్టర్ కేంద్ర బందానికి వివరించారు.ఈ కార్యక్రమాలలో రాష్ట పంచాయతి రాజ్ డైరెక్టర్ హనుమంత రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతం, స్థానిక జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిి, ఐటిడిఎ పిఓ పోట్రూ గౌతం, ఎఎస్పీ రోహిత్ రాజ్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, రభ ఈ ఈ భీంలా, పీఆర్ ఈ ఈ సుధాకర్, మిషన్ భగీరథ ఎస్ ఈ ఎస్ భాస్కర రావు , ఈ ఈ తిరుమలేష్, నళిని, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్, డీఈ విజయ్ కుమార్, జాతీయ రహదారుల డి ఈ శైలజ, డిఆర్వో అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
|