జయహో హైడ్రా..
` 60 ఏళ్లుగా చెరబట్టిన సర్కారుభూములకు విముక్తి
` ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలు తొలగించిన హైడ్రా
హైదరాబాద్(జనంసాక్షి): మధురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలను ఆదివారం హైడ్రా సిబ్బంది తొలగించారు. 1961 నుంచి ఉన్న ఆక్రమణలను తొలగించడంతో 1533 గజాల విస్తీర్ణంలోని పార్క్ అందుబాటులోకి వచ్చింది. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి విచారణకు ఆదేశించారు. 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఅవుట్ ఏర్పాటు చేశారు. 1,533 గజాల స్థలాన్ని పార్క్గా చూపించారు. లేఅవుట్ వేసిన నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్డు వేసి ఆక్రమించారు. అధికారులను మేనేజ్ చేసి ఇంటి నంబర్ కూడా తెచ్చుకున్నారు. ఈ లేఅవుట్లో 6 రోడ్లను అభివృద్ధి చేసి.. పార్క్ను మాత్రం ఖాళీ చేయించలేదని జీహెచ్ఎంసీకి పలుమార్లు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవటంతో సాయిసారధి నగర్ వాసులు హైడ్రాను ఆశ్రయించారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలతో కలిసి హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. ఇవాళ ఆక్రమణలు తొలగించారు. 60 ఏళ్ల పోరాటం ఫలించిందని స్థానికులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.