వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

మండిపడ్డ బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌
వరంగల్‌,డిసెంబర్‌21(జనం సాక్షి ): ప్రభుత్వ వర్సీటీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బిఎస్పీ నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థుల జీవితాలు బాగుచేయడానికే నా ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశా.టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రైవేటు యూనివర్సిటీలకు మేలు చేస్తోంది. చెంచాగిరి చేసేందుకు నేను బీఎస్పీలో చేరలేదు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చేరా.పేదలు చదవకుండా చేసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. పాలకులకు పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారని భయం.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్సీటీలకు 10వేల కోట్లు విడుదల చేయాలి. న్యాయం జరిగే వరకూ బీఎస్పీ నిద్రపోదు. బీఎస్పీని ప్రగతిభవన్‌కు పంపండి. బహుజన రాజ్యకోసం పోరాడుదాం. విద్యా, వైద్యం, స్వయం ఉపాధి కల్పించడమే బీఎస్పీ లక్ష్యం‘ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.