‘సంసద్’కు సంఘీభావం పలకండి
జాతీయ నేతలతో కోదండరామ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పేందుకు ఈనెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన సంసద్ యాత్రకు సంఘీభావం తెలపాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. సోమవారం ఆయన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ దేవిప్రసాద్, కో కన్వీనర్ శ్రీనివాస్గౌడ్తో కలిసి పార్లమెంట్ ఆవరణలో పలు జాతీయ పార్టీల ముఖ్యనేతలను కలిశారు. సంసద్యాత్రకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. బీజేపీ లోక్సభ పక్షనేత సుష్మాస్వరాజ్, ఆర్జేడీ నేత రఘువంశ్ప్రసాద్, తృణమూల్ కాంగ్రెస్ నేత ముఖుల్రాయ్, బోడోలాండ్ ఉద్యమకారుడు బిశ్వాల్, ప్రముఖ పర్యావరణ వేత్త, రాజసభ్య సభ్యుడు స్వామి తదితరులను కలిసి సంసద్ యాత్రకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ, తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీలు ఇది వరకే నిర్ణయం ప్రకటించాయని తెలిపారు. ప్రజలంతా కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మిగతా 2లోఉద్యమానికి తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, ముఖ్య నాయకుడు ఏబీ బర్ధన్లను వారి పార్టీ కార్యాలయాల్లో కలిసి సంసద్ యాత్రకు ఆహ్వానించారు. తాము చేపట్టే ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నామని, సీమాంధ్ర పెట్టుబడిదారులు డబ్బు సంచులను అడ్డేసి తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షను చాటి చెప్పేందుకే సంసద్యాత్ర చేపట్టామన్నారు. వారి వెంట ఢిల్లీ జేఏసీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కో ఆర్డినేటర్ రమేశ్ హజారీ, కో చైర్మన్ అజిత్ తదితరులు ఉన్నారు.