సంసద్ యాత్రతో సత్తాచాటుతాం
29, 30 తేదీల్లో చలో ఢిల్లీ : కోదండరామ్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) :
సంసద్యాత్రతో తెలంగాణ సత్తా చాటుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే దిశగా టీజేఏసీ సంసద్ యాత్ర చేప్టనుందని పేర్కొన్నారు.
ఈనెల 29, 30 తేదీల్లో ఢిల్లీలో రెండు వేల మందితో సంసద్యాత్ర చేపడుతున్నామని తెలిపారు. సంసద్యాత్రతో కేంద్రం కళ్లు తెరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అమరవీరుల ఆత్మత్యాగాలను అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ యాత్ర అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుందన్నారు.
చిన్న రాష్ట్రాల ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించిన అంబేద్కర్ జయంతిని 14న ఘనంగా జరుపుకోవాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆదర్శాలకు లోబడి ముందకెళ్తామని ఆయన పేర్కొన్నారు.