సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వర్తించాలి.

జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 20(జనంసాక్షి):
ఇంటర్మీడియట్‌, పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఆయన కలెక్టరేట్‌ లోని  కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్‌, ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ….
 జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్ సప్లిమెంటరీ(థియరీ), పదో తరగతి పరీక్షలను ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ జరుగుతాయని  తెలిపారు.
 జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాల స్టోరేజ్‌ పాయింట్లు 6 ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.ఇంటర్ లో మొత్తం 5,827 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా
పదవ తరగతిలో 890 మంది విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 2 పరీక్షా కేంద్రాల్లో ఆగస్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఎస్ఎస్సి సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
మారుమూల గ్రామాల విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తోపాటు జిరాక్స్ సెంటర్ లను మూయించేలా చర్యలు చేపట్టాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూముల నుండి ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ మోతిలాల్, డిఇఓ గోవిందరాజులు, ఇంటర్మీడియట్‌ నోడల్ అధికారి వెంకటరమణ, డిపిఆర్ఓ సీతారాం, ఏసీ రాజశేఖర్ రావు, లెక్చరర్ నరసింహులు, డి ఎల్ పి ఓ రామ్మోహన్ రావు, సెక్టోరల్ అధికారి బరపట్టి వెంకటయ్య, హెల్త్ డిపార్ట్మెంట్ శ్రీనివాసులు, ఆర్టీసీ, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.