సామాన్యులపై భారం పడకుండా చూడండి

5

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణిలను బలోపేతం చేయడానికి రాష్ట్ర సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఆర్థిక చేయూత అందించడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల కనీస బాధ్యత అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడితే అంతిమంగా ప్రజలే బాగుపడతారని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణిలపై హైదరాబాద్‌ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు.ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంస్థల ఆదాయ, వ్యయాలు, వస్తున్న నష్టాలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలు కునారిల్లిపోయాయని సీఎం కేసీఆర్‌ వివరించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఎప్పుడు మూత పడుతుందా అనే భయాందోళన ఉండేదన్నారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల ఫలితంగా విద్యుత్‌, ఆర్టీసీ సంస్థలు కోలుకున్నాయని, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయని చెప్పారు.అయినప్పటికీ ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలు ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల ఊబి నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం చేయాల్సినంత సహాయం చేస్తుందని, అదే సమయంలో ప్రజలు కూడా కొంత భారం మోయాల్సి వస్తుందని చెప్పారు.

విద్యుత్‌ సంస్థల నష్టాలకు 4 కారణాలు:-

విద్యుత్‌ సంస్థల నష్టాలకు ప్రధానంగా నాలుగు కారణాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చేందుకు ఖర్చుకు వెనకాడకుండా అదనపు సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు, లైన్ల నిర్మాణం చేపట్టింది. దీనికోసం తెలంగాణలోని రెండు డిస్కమ్‌ లు, ట్రాన్స్‌ కో కలిపి 2 వేల 144 కోట్లు అప్పులు చేశాయి.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తెలంగాణలో కోతల్లేని విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఉత్పత్తికి మించిన విద్యుత్‌ అవసరమవుతున్నది. గత ఏడాది జల విద్యుత్‌ కూడా ఉత్పత్తి కాలేదు. ఫలితంగా స్వల్పకాలిక పవర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్లతో విద్యుత్‌ కొనాల్సి వచ్చింది. దీనికోసం విద్యుత్‌ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 2 వేల 7 వందల కోట్లు ఖర్చుపెట్టాయి.మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా మెరుగుదల కోసం అధికారులు, ఉద్యోగులు కూడా చిత్తశుద్ధితో పనిచేశారు. అందుకే ప్రభుత్వం వారి వేతనాలు పెంచింది. ఈ భారం కూడా విద్యుత్‌ సంస్థలపై పడింది.రైతులకు పగటి పూట 9 గంటల కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విద్యుత్‌ సంస్థలు 2 వేల 4 వందల కోట్లు ఖర్చు చేసి సబ్‌ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ ఫార్మర్ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలు చేపట్టింది. ఈ నాలుగు ప్రధాన కారణాల వల్ల విద్యుత్‌ సంస్థలపై చాలా ఆర్థిక భారం పడిందని, దీన్నుంచి గట్టెక్కించడానికి విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని సీఎం హావిూ ఇచ్చారు.రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై అధికారులు పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. సామాన్య ప్రజలపై, గృహ వినియోగదారులపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా ఛార్జీలు పెంచుకోవడానికి సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ సంస్థలకు అవకాశం కల్పించారు. వంద యూనిట్లలోపు గృహ విద్యుత్‌ వినియోగించే వారికి చార్జీలు పెంచవద్దని సీఎం ఆదేశించారు. వంద యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే గృహ విద్యుత్‌ వినియోగదారులకు కూడా స్వల్పంగా పెంచాలని సూచించారు. రాష్ట్రంలో 86 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే అందులో 60 లక్షల కనెక్షన్లు 100 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడేవి కావడం గమనార్హం. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కువ మంది వినియోగదారులపై పెంపు భారం పడదు.

పరిశ్రమలకు సహేతుక పెంపు:-

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు పరిశ్రమలకు అనుకూలమైన విధానం అవలంభించడంతో పాటు, ఐటీ కంపెనీలకు నిరంతరాయ విద్యుత్‌ ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీని వల్ల కూడ విద్యుత్‌ సంస్థలపై భారీగా భారం పడింది. ఈ భారాన్ని కొంత మేర పంచుకోవాలని తెలంగాణ విద్యుత్‌ అధికారులు పరిశ్రమల నిర్వహకులను కోరారు. ఇటీవలే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ పై 10 శాతం చార్జీలు పెంచడం తమకు ఆమోద యోగ్యమే అని యజమానులు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ కు తెలిపారు. అయితే, పరిశ్రమలకు కూడ 10 శాతం కాకుండా, ఏడు శాతంలోపే పెంపుదల ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు:-

గత ప్రభుత్వాలు ఆర్టీసీని అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్టీసీ నష్టాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రూ. 2,275 కోట్ల అప్పు ఉంది. ప్రతి నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీని నడపడానికి చివరికి ఉద్యోగుల కో ఆపరేటివ్‌ సొసైటీ నుంచి రూ.180 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి నుంచి కాపాడడం కోసం ఆర్టీసీకి బడ్జెట్‌ లోనే నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతి నెల 75 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వ సాయాన్ని ఆర్టీసీకి అందిస్తున్నారు.అర్బన్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ ఆర్టీసీకి గుదిబండలా మారింది. ఎక్కువ నష్టాలు దీని వల్ల వస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించడానికి హైదరాబాద్‌ నగరంలో తిరిగే బస్సుల వల్ల వచ్చే నష్టాన్ని క్రాస్‌ సబ్సిడీ ద్వారా జీహెచ్‌ఎంసీ భరించే విధాన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మొదటి విడత రూ. 180 కోట్లు జీహెచ్‌ఎంసీ మొన్ననే చెల్లించింది.ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. 1100 బస్సులు పూర్తిగా పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి కొనడంతో అదనంగా మరో 100 బస్సులు కొత్తవి కొనాల్సి ఉంది. మొత్తంగా 12 వందల బస్సులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 300 కోట్ల రూపాయల వరకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించింది.ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారి వేతనాలు పెంచింది. డీజిల్‌ రేట్లు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. విద్యార్థుల బస్సు పాసులతోపాటు, వివిధ రాయితీల కింద ఇచ్చే బస్‌ పాస్‌ లపై అయ్యే వ్యయం దాదాపు రూ.500 కోట్లు ఉంటుంది. ఈ డబ్బును కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు చెల్లించాలని నిర్ణయించింది.ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరమని, ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సామాన్యులు, పల్లెప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోవిూటర్ల లోపు ఒక్క రూపాయి, 30 కిలోవిూటర్ల పైన ఎంత దూరమైనా రెండు రూపాయలు మాత్రమే పెంచాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. సగం మంది ఆర్టీసీ ప్రయాణికులు పల్లెవెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు కాబట్టి, పేదలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం విూద ఉంటుందని, అందుకే పల్లెవెలుగు ఛార్జీలను పెద్దగా పెంచవద్దని సీఎం చెప్పారు. మిగతా బస్సుల్లో కూడా పది శాతం మించకుండా ఛార్జీలు పెంచాలని సీఎం సూచించారు.తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. త్వరలోనే సింగరేణిపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, అన్ని అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు.తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం గురువారం వెలువడే అవకాశముంది. ఈ రెండు శాఖల అధికారులు తమ ప్రతిపాదనలు సీఎం కేసీఆర్‌ కు వివరించగా, సీఎం కూడా పలు సూచనలు చేశారు. సామాన్యులపై భారం పడని విధంగా పెంపు ఉండాలని ఆయన సూచించిన మేరకు అధికారులు తుది నివేదిక తయారు చేయనున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి ఇతర ప్రాంతాల్లో పర్యటనల్లో ఉండటంతో గురువారం పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునిల్‌ శర్మ, జెన్‌ కో సీఎండి డి. ప్రభాకర్‌ రావు, ఎస్డిపిడిసిఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.