డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలు

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్‌ చందు, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌) మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై.. అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారు.పిడబ్ల్యూడీ కమాండర్‌ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని.. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45) .. 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్‌ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపును అందుకుని అతని భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు’’ అని డీజీపీ తెలిపారు.