సిపిఐ నాయకులకు విజ్ఞప్తి ఖమ్మం రూరల్ సిఐ బదిలీ చేయాలని ఆందోళనను విరమించండి సమస్యలను సానుకూల పరిష్కారం చేయాలని పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ( అక్టోబర్09) జనం సాక్షి. ఆందోళనను విరమించండి.
సమస్యలకు సానుకూల పరిష్కారం.
 సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాల విజ్ఞప్తి .
ఖమ్మం రూరల్ సిఐ ని బదిలీ చేయాలని సిపిఐ సోమవారం తలపెట్టిన ఆందోళనను విరమించాలని పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాల ఉపేందర్రెడ్డి సిపిఐ నాయకులకు విజ్ఞప్తి చేశారు. సిపిఐ ప్రతిపాదించిన పలు సమస్యలకు సానుకూల పరిష్కారం త్వరలోనే చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 ఖమ్మం రూరల్ సిఐ సిపిఐ నాయకుల పట్ల, పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ నాయకులు తన దృష్టికి తీసుకు వచ్చారని ఆయన తెలిపారు.  అందుకు సంబంధించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ, తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రమాదకరంగా పరిణమించిన బిజెపి పార్టీని నిలువరించేందుకు సిపిఐ తో కలిసి పయనించాలని పార్టీ అధినేత కేసిఆర్  కూడా సూచించారని ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో సిపిఐ, టిఆర్ఎస్ మధ్య స్థానికంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏవి ఉన్ననూ త్వరలోనే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు తో పాటు సిపిఐ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో కూడా ప్రభుత్వం త్వరితగతిన తగు నిర్ణయం తీసుకుంటుందని ఉపేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు, భవిష్యత్తు రాజకీయ కర్తవ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆందోళన విరమించాలని సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.