ఆ అసత్యప్రచారాలను తెలంగాణ పటాపంచలు చేసింది

 

 

 

 

 

 

జనవరి 12(జనం సాక్షి):యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి విద్యుదుత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకట్లో మగ్గుతుందని అప్పట్లో అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. కానీ వాటిని తెలంగాణ పటాపంచలు చేసిందని తెలిపారు. అప్పట్లో అసత్య ప్రచారాలు చేసిన వారే ఇప్పుడు ఆ చీకట్లలోనే మిగిలిపోయారని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒక్కటైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ నాలుగో యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ కలను సాకారం చేసిన విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.