స్కూళ్లల్లో వ్యాక్సినూషన్‌ తప్పనిసరి

కాలిఫోర్నియా గవర్నర్‌ ఆదేశాలు
కాలిఫోర్నియా,ఆగస్ట్‌13(జనంసాక్షి): మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది అందరూ తాము కరోనా టీకా తీసుకున్నట్లు ఆధారం చూపించడం లేదా ప్రతివారం కోవిడ్‌`19 టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌ గేవిన్‌ న్యూసమ్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ దడ పుట్టిస్తున్న
నేపథ్యంలో కాలిఫోర్నియా ఈ నిర్ణయం తీసుకుందని, డెల్టా ప్రభావం ప్రధానంగా పిల్లలపై అధికంగా ఉంటుందని గేవిన్‌ గుర్తు చేశారు. టీకా తీసుకోని వారిపై కూడా ఇది పంజా విసురుతుందని తెలిపారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు కనుక ముందజాగ్రత్త చర్యగా మాస్క్‌ ధరించడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని గవర్నర్‌ తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌ తప్పకుండా ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మహమ్మారి నుంచి మనల్ని కాపాడేది కేవలం టీకా మాత్రమేనని ఈ సందర్భంగా గవర్నర్‌ ఉపోద్ఘాటించారు. ఒక తండ్రిగా నేను పిల్లలను మళ్లీ పూర్తి స్థాయిలో పాఠశాలల్లో చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం జరిందన్నారు. అలాగే క్లాస్‌రూంలో కూడా విద్యార్థులు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధన ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందన్నారు.