స్పాట్‌ ఫిక్సింగ్‌లో విందూ ధారాసింగ్‌ అరెస్టు

బాలీవుడ్‌ బెంబేలు
విచారణ ముమ్మరం చేసిన పోలీసులు
శ్రీశాంత్‌ సహా నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ
ముంబయి, మే 21 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో మరో పెద్ద వికెట్‌ పడింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, ధారాసింగ్‌ సింగ్‌ తనయుడు విందు ధారాసింగ్‌ను ముంబయిలోని జుహూ ప్రాంతంలో గల ఆయన నివాసంలో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విందు అరెస్టుతో ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. విందూ అనేక హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. గతేడాది విడుదలైన శ్రీరామరాజ్యంలో ఆయన హనుమంతుడి పాత్ర పోషించారు. చెన్నైలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ప్రశాంత్‌ అనే వ్యక్తిని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఇంట్లో నుంచి మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కొన్ని డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడికి బుకీలకు, క్రికెటర్లకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా అరెస్టు అయి కస్టడీలో ఉన్న క్రికెటర్‌ శ్రీశాంత్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడితో పాటు మిగతా నిందితులను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. వారికి కోర్టు జూన్‌ 4వరకు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.