హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు

` లోతట్టు ప్రాంత ప్రజలకు ఇక్కట్లు
` రహదారులు జలమయం
హైదరాబాద్‌(జనంసాక్షి):నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, రామ్‌నగర్‌, తార్నాక, ఎల్బీనగర్‌, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయ్యాయి. దీంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ భారీ వర్షం ధాటికి హబీబ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్‌ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైనేజీలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే, ముషీరాబాద్‌లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా, గోడ కూలడంతో సన్నీ (24) గల్లంతయ్యాడు.మరోవైపు, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ముషీరాబాద్‌, రామ్‌నగర్‌, తార్నాక, ఎల్బీనగర్‌, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం నీటితో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.
అశోక్‌ నగర్‌ స్టీల్‌ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ జామ్‌
మియాపూర్‌ మదీనాగూడ మార్గంలో జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది. కవాడీగూడ పద్మశాలి కాలనీలో పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లో, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు.