108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జెసి

కరీంనగర్‌, ఆగస్టు 3 : జిల్లాలో గర్భిణీలు 108 వాహనసేవల వినియోగించుకోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అన్నారు. శుక్రవారం నాడు 108 వాహనాలపై జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ.. జిల్లాలో ”అమ్మలాలన” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు 108 వాహనాలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రసవాలకు సంబంధించి జనవరి నెలలో 108 వాహనాలను 298 సార్లు వినియోగించుకోగా, ఫిబ్రవరిలో 339, మార్చిలో 479, ఏప్రిల్‌లో 550, మేలో 975, జూన్‌లో 1643, జూలైలో 1787 కేసులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదాలకు, ప్రసూతికి, ఇతర అత్యవసర కేసులకు 108 వాహనాల ద్వారా రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించినట్లు గుర్తించిన వాహన పైలెట్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొంటామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డిఆర్‌. నాగేశ్వరావు, డిఆర్‌డిఎ పి.డి. శంకరయ్య, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నర్సింగరావు, 108 పోగ్రాం మేనేజర్‌ భాష, ప్రభాకర్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.