2013లో మరో మెగా డీఎస్సీ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ప్రాధాన్యత

2012 రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి):

2013 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మరో డిఎస్‌సి నిర్వహిస్తాం.. ఆ డిఎస్‌సిలోను 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం.. వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు కూడా నియమకాలు చేపడతాం.. అని రాష్ట్ర ప్రాధమిక విద్య శాఖ మంత్రి కె.పార్ధసారధి అన్నారు. 2012-డిఎస్‌సిలో సాధించిన మార్కుల వివరాలను మాత్రమే ఆదివారంనాడు వెల్లడిస్తున్నామని అన్నారు. డిఎస్‌సి-2012రాత పరీక్ష ఫలితాలను సచివాలయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు
2013లో మరో ..
విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  డిఎస్‌సి, టెట్‌ మార్కులను కలిపి మెరిట్‌ జాబితా రూపొందిస్తామని, దాన్ని నెట్‌లో ఉంచుతామని చెప్పారు. అంతేగాక మెరిట్‌ జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తామని వెల్లడించారు. మెరిట్‌ జాబితాను వీలైనంత తొందరగానే రూపొందిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను నెల రోజుల్లోగా  పూర్తి చేయాలని ఇటీవలె ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారని, ఆ ఆదేశాలకు అనుగుణంగానే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో తప్పిదాల సవరణకుగాను అభ్యర్థులకు ఒక అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీలోపల వారు చేర్పులు, మార్పులు చేసుకోవచ్చని సూచించారు. 21,343 పోస్టులకు గాను దాదాపుగా మూడున్నర లక్షల మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. 6,007 స్కూలు అసిస్టెంటు, 12,772 సెకండరీ గ్రేడ్‌ పోస్టులు, 2,144 భాషా పండితులు, 409 పిఇటీ పోస్టులకు గాను రాతపరీక్ష జరిగిన విషయం తెలిసిందేనన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలలో 7,100 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను కూడా వెల్లడిస్తున్నామన్నారు. ఇందులో 355 ప్రిన్సిపాల్‌ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉందన్నారు. ఆదర్శ పాఠశాలల నోటిఫికేషన్‌ ద్వారా 4,615 పీజీటీ, 2,130 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పోస్టుల కోసం సుమారుగా 95వేల మంది పోటీ పడ్డారన్నారు. కోర్టు తీర్పుల వల్ల ఆదర్శ పాఠశాలల్లోని పోస్టుల భర్తీకి ఆలస్యమవు తోందన్నారు. వచ్చే ఏడాది నుంచి డిఎస్‌సి, టెట్‌ కలిపి ‘టెస్ట్‌’ పేరిట ఒకే పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నా మన్నారు. 12 మంది ఫలితాలను నిలిపివేశామని చెప్పారు. అంతేగాక కోడ్‌నంబర్‌ వేయని కారణంగా 486 మందిని అనర్హులుగా పేర్కొన్నామని తెలిపారు.  20 రూపాయలు చెల్లించి ఓఎంఆర్‌ షీట్లను పొందవచ్చని చెప్పారు.