30 ఏళ్లుగా ఏ రెండు రాష్ట్రాలూ నీటిపై ఒప్పందాలు చేసుకోలేదు

మాదే రైతు సర్కారు… కిరణ్‌
నిజామాబాద్‌, మే 13 (జనంసాక్షి) :
30 ఏళ్లుగా ఏ రెండు రాష్ట్రాలూ నీటిపై ఒప్పందాలు చేసుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో డివిజన్‌ స్థాయి రైతుసదస్సుల ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలను అమాయకులనుకుని ఏవేవో అబద్దాలు చెపుతూ మోసం చేయాలని చూస్తున్న నాయకులను పార్టీలను జాగ్రత్తగా గమనించాలని పిలుపునిచ్చారు. ఆయన  నాయకులకంటే, పార్టీలకంటే ప్రజలు నిజమైన తెలివిగల వారని బాబుకు తెలియడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అబద్దాలతోనే కాలం గడుపడం అలవాటైందని విమర్శించారు. ప్రేమలు ఒలక పోయడం కాంగ్రెస్‌కుగాని తనకుగాని రాదని, ఇచ్చినమాటలను తప్పకుండా అమలు చేయడమే తమ ప్రత్యేకతన్నారు. నిత్యం అసత్యాలు చెపుతూ కాలం వెల్లదీయడం బాబుకు అలవాటై పోయిందన్నారు. చింతసచ్చినా పులుపు చావదన్న సామెత బాబుకు నూటికి నూరుశాతం వర్తిస్తుందన్నారు. దేశంలో గత ముప్పై సంవత్సరాల్లో ఏ రెండు రాష్టాల్రు నీటిసంపదపై ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇది మనకే దక్కిందన్నారు. మహారాష్ట్రతో కలిసి పెద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నామన్నారు. గత నెలరోజులుగా ఏదో కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నామన్నారు. ప్రధానంగా రైతులను చైతన్యవంతులను చేసేందుకుగాను రైతు చైతన్యయాత్రలను నిర్వహించామన్నారు. ఇందులో 19న్నర లక్షల మంది రైతులు పాల్గొన్నారంటే మామూలు విషయం కాదన్నారు. రైతు సదస్సులను కూడా నిర్వహించి మరింత చైతన్యం చేయగలిగామన్నారు. రాష్ట్రంలోని 74 డివిజన్లలో రైతు సదస్సులను నేటితో ముగిస్తున్నామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరంచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఒక్కసారిగా మార్పు రావాలంటే సాధ్యం కాదన్నారు. తమది రైతు ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పుకునే స్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. చంద్రబాబు 9 ఏళ్లపాలనలో ఏఒక్కరోజు కూడా రైతు ప్రభుత్వంగా చెప్పుకోలేక పోయారంటే ఆయన చిత్తశుద్దిని ప్రజలే అర్థంచేసుకోగలరన్నారు. 2004-05లో వ్యవసాయానికి, అనుబంద సంస్థలకు కేవలం 900కోట్లు ఉండేదని, నేడు 5,500కోట్లకు పెంచగలిగామన్నారు. ఉచిత విద్యుత్‌, పావలా వడ్డీ పథకాలు  అదనంగా ఉన్నాయన్నారు. వ్యవసాయాన్ని వేరేగా చూపించి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి ప్రధానమని, దీనిని సమకూర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. గతంలో 8,9వేల కోట్లు మాత్రమే రైతులకు బ్యాంకులనుంచి రుణాలిచ్చేవారని, నేడు ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 72వేల కోట్లు ఒక్కసంవత్సరంలో ఇస్తున్నాయన్నారు. కేంద్రంలో సోనియా తీసుకున్న నిర్ణయం మేరకే ఇంతమొత్తం రుణాలు రైతులకు వస్తున్నాయన్నారు. ఇంతే కాకుండా సంవత్సరం లోపు రైతులు తీసుకున్న అప్పులను తిరిగిచెల్లిస్తే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అసలు కట్టండి చాలు, వడ్డీ అసలే వద్దు అని ప్రబుత్వం పెద్ద ఎత్తున నినాదంగా పనిచేస్తుందన్నారు. లక్ష రూపాయలలోపు అప్పులు తీసుకున్న రైతులు సుమారు 95లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికి ఈ వడ్డీ మినహాయింపు వర్తిస్తుందన్నారు. నాలుగువేల కోట్ల ఉచిత విద్యుత్‌పై వెచ్చిస్తున్నామన్నారు. పంటలు పండాలంటే నీరు ప్రధానమని, వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉన్నా ఎక్కువగా దిగుబడి వచ్చిందంటే ప్రబుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. తక్కువగా నీరున్నా కూడా డ్రిప్‌, స్పింక్లర్‌ ఇరిగేషన్‌ ద్వారా వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. రైతులకు ఇచ్చిన అప్పులను పూర్తిగా మాఫీచేస్తామంటూ చంద్రబాబు అసత్యాలు చెప్తున్నాడని విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన రుణాలను మాఫీచేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. దేశంలో రైతుల రుణాలు మాఫీచేయాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాద్యం అవుతుందన్నారు. దేశంలో ఒకే ఒకసారి సోనియా నేతృత్వంలో 63వేలకోట్ల రుణాలను మాఫీచేస్తే రాష్ట్రంలో 13వేల కోట్లు మాఫీ అయ్యాయన్నారు.  ఒక సంవత్సరంలోనే రైతులకు 72వేలకోట్ల రుణాలు ఇస్తుంటే మాఫీ ఎలా సాధ్యం అవుతుందో ఆలోచించాలన్నారు. జుట్టుంటేనే కొప్పు ముడుచుకునేదని సామెత చెపుతూ నీరుంటేనే వ్యవసాయం దివ్యంగా సాగుచేసుకోవచ్చన్నారు. దీనిని గుర్తించిన తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దఎత్తున జలయజ్ఞం చేపట్టిందన్నారు. కోటి ఎకరాలను అదనంగా సాగులోకి తేవాలన్నదే తమ లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 22లక్షలు పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 ప్రాజెక్టులు పూర్తిచేయడమో, పాక్షికంగా పూర్తిచేయడం వల్లనో మపరో 30లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రయత్నాలుచేస్తున్నామన్నారు. వీటిని కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించేలా ఒత్తిడి చేస్తున్నామన్నారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే మహారాష్ట్రతో కలిసి ఒప్పందం చేసుకున్నామని, ఏ రెండు రాష్టాల్రు గత ముప్పై ఏళ్లలో చేసుకోనే లేదన్నారు. నీరివ్వడంతోపాటు గిట్టుబాటు ధర కూడా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సన్న బియ్యంకు క్వింటాల్‌కు 1500 రూపాయలు ప్రకటించామన్నారు. కేంద్ర ప్రభుత్వం 1280 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్రం 1500 ఇస్తోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏఒక్క రైతు ముందుకు రావడంలేదని, బయట వారికి 1600నుంచి 1800 పొందుతున్నారన్నారు. ఒక్క రూపాయి బియ్యం పథకాన్ని ప్రారంభంచడం జరిగిందన్నారు. దీని వెనుక 25 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండేందుకుగాను 9వస్తువులను కలుపుకుని 185 రూపాయలకే ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 10 రకాల వస్తువులను కలుపుతున్నామన్నారు. ఈపనిపై మంత్రి శ్రీదర్‌బాబు కృషిచేస్తున్నాడని సిఎం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 1250 కోట్లు, బిసిలకు 4027కోట్లు, మైనార్టీలకు 1020కోట్లు ఒక్క సంవత్సరమే వెచ్చిస్తున్నామన్నారు. రైతులకు చిట్టచివరిగా ప్రబుత్వం కల్పించేది పంటలు చెడిపోయినప్పుడు, నష్టం సంబవించినప్పుడు పరిహారం ఇవ్వడమన్నారు. 1999 వరకు 1250 రూపాయల పరిహారం మాత్రమే ప్రభుత్వాలు చెల్లించేవని, చంద్రబాబు హయంలో కేవలం 1500కు మాత్రమే పెంచాడన్నారు. 2004లో కాంగ్రెస్‌ అదికారంలోకి రాగానే 4500 పెంచడం జరిగిందని, తాను సిఎం అయ్యాక తొలినాళ్లలో 6వేలకు పెంచామని, ప్రస్తుతం 10వేల రూపాయలిస్తున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏప్రిల్‌ తర్వాత కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వాటి వివరాలను త్వరగా పంపిస్తే రైతుల ఖాతాల్లోకి పరిహారం జమచేస్తామని హామి ఇచ్చారు. గత ఖరీఫ్‌ నాటికి,  ప్రీరబీ వరకు పంటలు నష్టపోయిన రైతులకు 1636కోట్ల రూపాయలను పరిహారం క్రింద రైతులకు చెల్లించామన్నారు. తాను నడిపిస్తున్న స్పీడ్‌ 2014వరకు కొనసాగించాల్సిందేనన్నారు. ఇందుకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లాలోని వైద్య కళాశాలకు ఇప్పటికే 165కోట్లు కేటాయించామని, సిబ్బంది వేతనాలతో కలుపుకుని 200కోట్లు ఇస్తున్నామన్నారు. ఈసంవత్సరమే నిజామాబాద్‌ వైద్యకళాశాలలో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణా విశ్వవిద్యాలయానికి అవసరమైన 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి 9కోట్ల రూపాయలను, బోదన్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేశారు. జిల్లాకు ఇదే ఆఖరు పర్యటన కాదని, మల్లీ మల్లీ వచ్చేది ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు సుదర్శన్‌రెడ్డి, కన్నాలక్ష్మినారాయణ, శ్రీదర్‌బాబు, విప్‌ అనిల్‌, ఎంపి మధుయాష్కి గౌడ్‌తోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.