బాలల హక్కుల యోధులకు అపూర్వ గౌరవం

1
మలాల, సత్యార్థికి శాంతి నోబెల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : బాలల హక్కుల కోసం పోరాడిన యోధులకు అపూర్వ గౌరవం దక్కింది. భారత్‌కు చెందిన కైలాస్‌ సత్యార్థి, పాకిస్తాన్‌కు చెందిన మలాల యూసుఫ్‌జాయ్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని భారత్‌లో కలసి పాకిస్థాన్‌ పంచుకోబోతుంది. ఈ బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. పాకిస్థాన్‌ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌, భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్‌ సత్యార్థిలకు ఈ బహుమతి లభించింది. విదీష ప్రాంతానికి చెందిన కైలాస్‌ సత్యార్థి బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు. బాలకార్మికులుగా పనిచేస్తున్న, వెట్టిచాకిరీ చేస్తున్న 80వేల మంది బాలలను ఆయన రక్షించారు. కైలాస్‌ సత్యార్థి నోబెల్‌ బహుమతి అందుకోనున్న ఏడో భారతీయుడిగా కీర్తిఘడించారు. పాకిస్థాన్‌కు చెందిన 17ఏళ్ల మలాలా యూసుఫ్‌జాయ్‌ బాలికల విద్య కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్ల దాడికి గురైన ఆమెకు ఇంగ్లాండ్‌లో చికిత్స పొంది అక్కడే స్థిరపడింది.  బాలల విద్యకోసం పాడుపడుతున్న ఆమెపై తాలిబన్లు దాడి చేసి చంపాలని చూశారు. వారికి ఎదురొడ్డి ఆమె ధైర్యంగా బాలికా విద్యకోసం పోరాడారు.  అనంతరం ఆమె ఐక్యరాజ్యసమితిలో సైతం బాలికల విద్యాహక్కుపై ప్రసంగించారు. తొలిసారిగా పొరుగు దేశాలైన భారత్‌, పాకిస్థాన్‌లు నోబెల్‌ శాంతి బహుమతిని సంయుక్తంగా గెలుపొందాయి. ఈ ఏటి ఇద్దరు విజేతల్లో ఒకరు హిందూ, ఒకరు ముస్లిం ఈ బహుమతిని ఉమ్మడిగా అందుకోవడం విశేషం. ఒకరు రెండున్నర దశాబ్దాలుగా ఉద్యమబాట పట్టిన అనుభవజ్ఞులు కాగా మరొకరు తన అనుభవాలతో సమస్య తీవ్రతను గుర్తించి, పరిష్కారం దిశగా కృషి ప్రారంభించిన కిశోర బాలిక. భారత్‌కు చెందిన కైలాస్‌ సత్యార్థి, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసుఫ్‌జాయ్‌ ఒకే ఏడాది నోబెల్‌ శాంతిబహుమతి గెలుపొందడం విశేషం.  పాకిస్థాన్‌కి చెందిన 17 ఏళ్ల మలాలా యూసుఫ్‌జాయ్‌ నోబెల్‌ బహుమతి అందుకోనున్న అత్యంత పిన్నవయస్కురాలవుతారు. గతంలో పాతికేళ్ల వయసులో భౌతిక శాస్త్ర నోబెల్‌ పొందిన లారెన్స్‌ బ్రాగ్‌ పేరున ఉన్న రికార్డు మలాలా సొంతం కాబోతోంది. నోబెల్‌ బహుమతి లభించడం చాలా సంతోషంగా ఉందని మధ్యప్రదేశ్‌లోని విదీష ప్రాంతానికి చెందిన కైలాస్‌ సత్యార్థి అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా బాలల హక్కుల పరిరక్షణకు కృషిచేస్తున్న సత్యార్థి తనకు నోబెల్‌ బహుమతి ప్రకటించడం ద్వారా కోట్లాది బాలల గొంతు ప్రపంచం విందని అర్థమైందన్నారు. బాలల హక్కుల కోసం పోరాడినందుకు తనకు గుర్తింపు లభించిందన్నారు. గాంధీ మార్గంలో శాంతియుత ఆందోళనల ద్వారా బాలల హక్కులకోసం పోరాడుతున్న వ్యక్తిగా సత్యార్థిని నోబెల్‌ బహుమతి ప్యానల్‌ ప్రశంసించింది.

వందేళ్లలో ఏడుగురు.. నోబెల్‌ బహుమతి పొందిన భారతీయులు

1913లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సాహిత్యంలో నోబెల్‌ బహుమతి గెలుచుకుని ఆ గౌరవం పొందిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత ఒక్క రసాయన శాస్త్రంలో మినహా మిగిలిన అన్ని రంగాల్లోనూ భారతీయులు నోబెల్‌ బహుమతి గెలుచుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు నోబెల్‌ బహుమతి గెలుచుకున్నవారి వివరాలు చూస్తే..  1913 – రవీంద్రనాథ్‌ టాగూర్‌- సాహిత్యం , 1930 – సీవీ రామన్‌- భౌతిక శాస్త్రం , 1968 – హర్‌గోవింద్‌ ఖొరానా – వైద్యం , 1979 – మదర్‌ థెరిస్సా – శాంతి , 1983 – సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌ – భౌతిక శాస్త్రం  1998 – అమర్త్యసేన్‌ – ఆర్థిక శాస్త్రం , 2014 – కైలాష్‌ సత్యార్థి- శాంతి వీరు కాకుండా భారత్‌తో సంబంధం ఉన్న నోబెల్‌ విజేతలు మరికొందరున్నారు.  భారత్‌లో పుట్టిన బ్రిటిష్‌ పౌరులు – రొనాల్డ్‌రాస్‌, రుడ్‌యార్డ్‌ క్లిపింగ్‌  , భారత్‌లో పుట్టి ఇతర దేశాల్లో స్థిరపడిన వారు(వెంకటరామన్‌ రామకృష్ణన్‌- రసాయన శాస్త్ర నోబెల్‌- (2009) , ట్రినిడాడ్‌లో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన భారతసంతతి వ్యక్తి- వీఎస్‌ నైపాల్‌  భారత్‌లో పుట్టిన పాకిస్థాన్‌ పౌరుడు- అబ్దుస్‌ సలాం , టిబెట్‌లో పుట్టి భారత్‌లో నివసిస్తున్న దలైలామా  భారత్‌లో పుట్టిన బంగ్లాదేశ్‌ పౌరుడు- మహ్మద్‌ యూనస్‌ , ఐపీసీసీ పేరుతో భారతీయుడు రాజేంద్రకుమార్‌ పల్మరి నిర్వహిస్తున్న చారిటీ సంస్థ కూడా నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకుంది.