నీటి సంపులో పడి బాలుడు మృతి

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 26(జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 నెలల బాలుడు ప్రమాదవశాత్తు గురువారం నాడు ఇంటి ఆవరణలో గల నీటి సంపులో పడి మృతి చెందాడు. స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న అర్జున్ దాస్ కుమారుడు కరణ్ కుమార్(13 నెలలు) తల్లి నిద్రిస్తున్న సమయంలో సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తన సోదరితో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. వీరి స్వగ్రామం బాసుదేయోపూర్, బీహార్ రాష్ట్రంగా గుర్తించారు. అదే ఇంట్లో అద్దకుంటున్న సంతోష్ పని ముగించుకుని ఇంటికి రావడంతో నీటి సంపులో తమ్ముడు పడిపోయాడని బాలుడి సోదరి చెప్పగా వెంటనే సంపులో చూడడంతో బాలుడు నీటిలో మునిగి చనిపోయి ఉన్నాడని గ్రహించి, బాలుడి తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై భాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.