కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
ఆగష్టు 16(జనం సాక్షి)నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు. దిగువకు 1,10,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ఆ దృశ్యాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. కడెం ప్రాజెక్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 6484 క్యూసెక్కుల వరద వస్తుండగా 2 గేట్లు ఎత్తి 4571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక భారీ వరదతో స్వర్ణ జలాశయం 3 గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుండపోత వర్షాలతో పొచ్చెర జలపాతానికి నీటిప్రవాహం పెరిగింది.