ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌ రద్దు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచికి జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆ పదవి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా గ్రామాల్లో సర్పంచ్ ఒక పార్టీ అయితే.. ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య విభేదాలు ఏర్పడితే అభివృద్ధికి ఆకంటం కలుగుతుందనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.