పంత్ దూకుడుకు రాహుల్ సలాం.. వైర‌ల్ వీడియో చూశారా?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకాలతో చెలరేగగా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ దూకుడైన అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. దీంతో శుక్రవారం హెడింగ్లీలో ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.
పంత్‌కు రాహుల్ న‌మ‌స్కారం.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
తొలి రోజు ఆట ముగిసి గిల్, పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో భారత ఆటగాళ్లందరూ చప్పట్లతో వారికి ఘన స్వాగతం పలికారు. అయితే, పంత్ మెట్లు ఎక్కుతుండగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు చేతులు జోడించి అతనికి నమస్కరిస్తూ అభినందించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ సాహసోపేతమైన బ్యాటింగ్‌కు రాహుల్ ఈ విధంగా ప్రశంసలు కురిపించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ధోనీ రికార్డు బ్రేక్ చేసిన పంత్‌
ఈ మ్యాచ్ ద్వారా పంత్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు.  (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ అధిగమించాడు. పంత్ ఇప్పటివరకు ‘సేనా’ దేశాల్లో 27 మ్యాచ్‌లలో 38.80 సగటుతో 1,746 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇవాళ‌ రెండో రోజు ఆటలో భారత్ ఇదే జోరును కొనసాగించి భారీ స్కోరు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజావార్తలు