అస్సాంలో తగ్గిన వరద ఉధృతి

గువాహతి, జూలై 5: అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి చెందిన టికారాయ్‌ శర్మ(56) మాట్లాడుతూ తన 21 పాలిచ్చే ఆవులు నీటిలో కొట్టుకునిపోయాయన్నారు. 60 మేకలు గల్లంతయ్యాయన్నారు. ‘జూన్‌ 26న నది ఒడ్డు కోసుకుని పోయింది. అర గంటలో వందలాది ఇళ్లు మాయమై పోయాయి. వందలాది పశువులు కొట్టుకుపోయాయి. మాలో కొంత మంది చెట్టు మరికొందరు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉన్నా పూరిగుడిసెలు కొట్టుకుపోయాయి. మరికొందరు పడవలో దూరంగా వెళ్లిపోయారు’ అని చెప్పారు. సోమవారం నుంచి వరద నీరు తీయటం ప్రారంభమైంది. కాసోమరి, మజులి, ఊపర్‌ గోర్హపాల్‌ గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా నేపాలీ సంతతి వారు. మా పశువులన్నీ కొట్టుకుపోతే మేం ఎలా జీవించాలి అని 51 ఏళ్ల దిల్‌ బహుదూర్‌ ప్రశ్నించాడు. సైన్యం సకాలంలో రంగ ప్రవేశం చేసి పిల్లలను, మహిళలను దూరంగా ఉన్న సహాయక శిబిరాలకు తరలించింది. సూటీలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. నాదుర్‌ రెవెన్యూ సర్కిల్‌లో పలువురు అన్నీ పోగొట్టుకున్న వారు ఇక్కడ చేరారు. గత వారం రోజుల్లో 37 శిబిరాలలో సుమారు 35 వేల మందికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. రద నీరు తీసినా అంటువ్యాధుల ప్రమాద అలాగే ఉంది. విధ్వంస ఛాయలు అలుముకున్నాయి.