కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!

గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి ముప్పేట దాడిన ఎదుర్కొంటున్న కోహ్లిని తర్వలో పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీసే కోహ్లికి ఆఖరుదని బీసీసీఐ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లి రాణించినా ప్రయోజనం లేదని, పరిస్థితి చేయి దాటి పోయిందని తెలుస్తోంది. రెస్ట్‌ పేరుతో విండీస్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లిని ఎంపిక చేయని సెలెక్టర్లు, ఆతర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా పక్కకు పెట్టాలని భావిస్తున్నారట. టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో విండీస్‌ సిరీస్‌ కీలకం కావడంతో కోహ్లి మినహా సీనియర్లంతా (రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రిషబ్‌ పంత్‌, మహ్మద్‌ షమీ) తిరిగి జట్టులో చేరతారని సమాచారం.

కోహ్లి ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతుండగా దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లాంటి వాళ్లు మిడిలార్డర్‌లో పాతుకుపోవడంతో వేటు ప్రచారం వాస్తవమే అయ్యిండ వచ్చని నెటిజన్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడిన కోహ్లి టీ20 సిరీస్‌లో (ఇంగ్లండ్‌) రెండో మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లికి తుది జట్టులో స్థానంపై కూడా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.