తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
డిమాండ్లతో కూడిన నోటీస్ ఇచ్చిన జేఏసీ
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాడు బస్ భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె తేదీపై 14 రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని.. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే పక్రియను వెంటనే చేపట్టాలన్నారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. మహాలక్క్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి.పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి.ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి.అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.


