ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి11(జనంసాక్షి): ఇటీఅవల అసెంబ్లీ ఎన్నికలను మించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఉత్సాహం నెలకొందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. కెసిఆర్ విధానాలు నచ్చి ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు టిఆఎర్ఎస్లో కలవడం అభినందనీయమని అన్నారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో సత్తాచాటి రెండు సీట్లు గెల్చుకుంటామని అన్నారు. భారీ మెజార్టీతో గెల్చుకోబోతున్నామని అన్నారు. ఈ నెల 16వ తేదీన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఖమ్మం రానున్నారని తెలిపారు. జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కెటిఆర్కు ఘన స్వాగతం పలకడంతో పాటు, ఖమ్మంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరుగనున్న ఎన్నికల సన్నాహక సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్మికులు, మహిళలు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు తరలి రావాలని కోరారు. ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీ ఇచ్చి పార్టీ ప్రతిష్టను మరింత పెంపొందించాలని జలగం కార్యకర్తలను కోరారు.