పాతబస్తీలో మైనారిటీ మంత్రి పర్యటన

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా గురువారం రాజధానిలోని మక్కా మసీదును అధికారికంగా సందర్శించారు. మసీదు అభివృద్ధికోసం గత ఏడాది వచ్చిన వినతి మేరకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో మక్కా మసీదులో భూగర్భ నీటి ట్యాంకు, వాటర్‌ హౌజ్‌లో నీటి శుద్ధి యంత్రాలు, వ్యాక్యూమ్‌ క్లీనర్స్‌ కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మక్కా మసీదుతోపాటు నాంపల్లిలోని షాహీ మసీదు అభివృద్ధి కోసం 36 లక్షలు విడుదల చేస్తామన్నారు. చార్మినార్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రి, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఇతర అధికారులు ఈ సందర్భంగా మంత్రితోపాటు పర్యటనలో పాల్గొన్నారు.