మాతృశ్రీ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

మాతృశ్రీ కళాశాల డైరెక్టర్ల వినతి

నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : నర్సంపేట పట్టణంలోని మాతృశ్రీ జూనియర్‌ కళాశాలపై అసత్య ఆరోపణలను మానుకోవాల్సిందిగా ఆ కళాశాల డైరెక్టర్లు గడ్డం శ్రీనివాస్‌, గుగులోతు యాకూబ్‌, తిరుపతి, కృష్ణమూర్తి, డేవిడ్‌, శంకర్‌, అనీల్‌, పూర్ణచందర్‌లు కోరారు. శనివారం నర్సంపేట పట్టణంలోని మాతృశ్రీ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ కళాశాలకు అన్ని విధాల అనుమతులున్నాయని స్పష్టం చేశారు. కావాలని కొద్ది మంది వ్యక్తులు పనికట్టుకొని తమ విద్యాసంస్థను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ కళాశాలల్లో అద్యాపకులుగా పనిచేసిన వ్యక్తులే యాజమాన్యంగా ఏర్పడి ఎస్సీ, ఎస్టీ, బీసీి, మైనార్టీ విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్యనందించాలనే లక్ష్యంతో మాతృశ్రీ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ ఎదుగుదలను ఓర్వలేకనే తమకు గిట్టని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈదుష్ప్రచారం వెను ఎవరి ప్రమేయం ఉందో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలుసన్నారు. తమ కళాశాలకు విద్యార్థుల నుంచి వస్తున్న ఆదరణను చూసి కొద్ది మంది వ్యక్తులు కావాలనే లేని పోని అసత్య ఆరోపణలను చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ కళాశాలపై అసత్య ఆరోపణలు మానుకొని నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరారు.