ముఖ్యమంత్రి పర్యటనకు కిన్నెరసాని ముస్తాబు

ఖమ్మం, జూలై 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 11వ తేదీన పర్యటనకు రానున్న సందర్భంగా కిన్నెరసాని ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా పాల్వంచ మండలానికి వస్తున్న కారణంగా వివిధ ప్రభుత్వ శాఖల హడవిడి మొదలైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 36 కోట్ల వ్యయంతో నిర్మించిన 10వేల ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ప్రాజెక్టు వద్దనే శంకుస్థాపన కోసం ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పాల్వంచ పట్టణంలో కోటిన్నర వ్యయంతో నిర్మాణం చేస్తున్న మున్సిపాల్టీ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అదే సభలో 6వేల కోట్ల వ్యయంతో కెటిపిఎస్‌ ఏడవ దశ విస్తరణ పనులను ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశం ఉండడంతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పాల్వంచ మండలంలో 1975లో జలగం వెంగలరావు రెండు సార్లు పర్యటించారు. 1989లో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కిన్నెరసానిలో పర్యటించారు. 24 సంవత్సరాల తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆగస్టు 11వ తేదీన కిన్నెరసానిలో పర్యటనకు రానున్నారు.