రాజన్న ప్రచార రథయాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన

వేములవాడ, జూన్‌ 14, (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి విశిష్టత, మహిమలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం బయలుదేరిన ధర్మ ప్రచారయాత్రకు జిల్లాలోని వివిధ గ్రామాలలో అపూర్వ స్పందన ఉంటోందని ఆలయ సూపరెండెంట్‌ గౌరీశంకర్‌, అసిస్టెంట్‌ లక్ష్మిరాజంలు  ‘జనం సాక్షి’ కి తెలిపారు.  15వ తేదీ నుండి ప్రారంభమయిన మొదటి విడత  రధయాత్ర ఈ నెల 24 వరకు కరీంనగర్‌ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పర్యటనకు గాను అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా  శనివారం నాడు కరీంనగర్‌ నుండి బయలుదేరిన ఈ ధర్మప్రచార యాత్రను ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు తమతమ గ్రామాలకు మంగళహారతులతో సాదరంగా ఆహ్వానించి, రథంలో ఉన్న శ్రీరాజరాజేశ్వరస్వామి, పార్వతీ అమ్మవారు, వినాయకులను దర్శించి ఆనందపారవశ్యం చెందారని తెలి పారు. కాగా మార్గమధ్యంలో ఆయా గ్రామాలలో ఉన్న విద్యుత్‌ స్థంబాలకు వేలాడుతున్న కరంటు తీగలు పక్కకు జరుపుతూ వెళ్ళాల్సి రావడం ఇబ్బందిగా ఉంటోందని పేర్కొన్నారు. రథయాత్రకు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆయా గ్రామాలకు చేరుకోవడం ఆలస్యమవుతోందని, యాత్రకు నియమించిన సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల అనుకున్న సమయానికి నిర్ణీత స్థలాలకు చేరుకోలేకపోతున్నందున అదనంగా మరింత మంది ఆలయ సిబ్బందిని పంపించినట్లయితే రథయాత్ర నిర్విఘ్నంగా పూర్తిచేయ గలుగుతామని పేర్కొన్నారు.

ఆదివారం రథయాత్ర జరిగే గ్రామాలు : కరీంనగర్‌ జిల్లాల ప్రజలకు రాజన్న దర్శనంతో పాటు స్వామివారి మహిమలు, ధార్మిక ప్రచారం గావించడానికి వేములవాడ నుండి బయలు దేరిన ధర్మ ప్రచార యాత్ర ఆదివారం నాడు జమ్మికుంట మండలం ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్తానం నుండి బయలుదేరి అక్కడి నుండి మల్యాల, మర్రిపెల్లిగూడెం, కమలాపూర్‌, ఉప్పల్‌ మీదుగా హుజూరాబాద్‌కు చేరు కుంటుంది. హుజూరాబాద్‌లోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు సాయంత్రం వివిధ పూజా కార్యక్రమాలతో పాటు భజన కార్యక్ర మాలు నిర్వహించి అక్కడే బస చేస్తారు. ఈ రథం వెంబడి బయలుదేరిన రాజన్న ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులు, ఒక సూపరెండెంట్‌తో పాటు మరో ఆరుగురు సిబ్బంది  ఆయా గ్రామాల ప్రజలు, భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తారు.