రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా గవర్నర్‌ పట్టించుకోరేం: భాజపా

హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అనేక వ్యవహారాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా గవర్నర్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమని భాజపా తప్పుబట్టింది. రాజ్యాంగ పరిరక్షణకు గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీఎన్‌ఎస్‌ ప్రభాకర్‌ ప్రశ్నించారు. న్యాయవిచారణకు  ఒప్పుకొనేది లేదంటూ కేబినెట్‌ స్పష్టం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు. స్థానిక ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అవినీతి మంత్రులకు సహకారం అందించాలన్న కేబినెట్‌ నిర్ణయంపై గవర్నర్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు.