రాహుల్ సదస్సులో నారా బ్రాహ్మణి
జెసి, టిజి తనయులు కూడా హాజరు
హైదరాబాద్,ఆగస్ట్14( జనం సాక్షి ): ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కనిపించడం విశేషం. దాదాపుగా 250 మంది వ్యాపారవేత్తలతో నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు కనిపించి ఆశ్చర్యపరిచారు. ఒకవైపు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాల మధ్యన ఈ సమావేశంలో టీడీపీ వాళ్లు కనిపించడం ఆసక్తికరం. చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి రాహుల్తో సమావేశానికి హాజరయ్యారు. హెరిటేజ్ సంస్థ ప్రతినిధిగా, ప్రముఖ పారిశ్రామిక వేత్తగా బ్రహ్మణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పాలి. కేవలం బ్రహ్మణి మాత్రమే కాదు.. అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కూడా రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరు కావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో జేసీ పవన్ అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. ఇక కర్నూలు జిల్లా టీడీపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. టీజీ భరత్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.వీరి రాక ఒకింత ఆశ్చర్యం కలిగించినా వీరంతా పారిశ్రామికవేత్తల ¬దాలో పాల్గొన్నారు.



