రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ   సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసే సదస్సును జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 15 శాతం ఉన్న ముస్లింలు విద్యా, ఉద్యోగ రంగాల్లో సరైన రిజర్వేషన్లు లేక వెనుకబడి ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పార్టీలు ముస్లింల ఓట్లను తీసుకుని అధికారం చేపట్టిన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదని విమర్శించారు. పగడ్బందీగా చట్టం తీసుకువచ్చి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ముస్లిం సోదరులు ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరై  విజయవంతం చేయాలని ఆయన కోరారు.