చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

` అధికారులు అప్రమత్తంగా ఉండాలి
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్‌(జనంసాక్షి):శాసన మండలి,శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని సభలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్‌ అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని, పారదర్శకంగా, వేగంగా మంత్రులకు, సభ్యులకు సమాచారం అందించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం శాసనసభ ప్రాంగణంలోని మొదటి సమావేశ మందిరంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు తో కలిసి సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. అత్యంత ప్రజాసామికంగా సభ జరపాలని ప్రభుత్వం సీరియస్‌ గా ఆలోచన చేస్తుందని, ప్రజలకు, సభ్యులకు జవాబుదారీగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఉన్నందున అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశాలకు మంత్రులు చాలా సీరియస్‌ గా ప్రిపేర్‌ అయి వస్తున్నందున అధికారులు కూడా అందుకు అనుగుణంగా పూర్తి సమాచారంతో సభలు జరిగినన్ని రోజులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అత్యంత పవిత్రమైనవి ఈ సభకు వచ్చే సభ్యులు గొప్ప ఆశయాలు, లక్ష్యాలతో సభకు వస్తున్నారన్న విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలని తెలిపారు. ప్రజలకు ఏదో మేలు చేయాలన్న తపనతో ప్రతి సభ్యుడు సభకు వస్తారు, ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రాబట్టాలన్న ఆలోచనలతో సభ్యులు ఉంటారు కాబట్టి అధికారులు అన్ని ప్రశ్నలకు పారదర్శకంగా, పూర్తి సమాచారంతో సభకు హాజరై మంత్రులకు నేను వెంటనే సమాచారం ఇచ్చి సభ ద్వారా సంతృప్తికర సమాధానాలు వెళ్లేలా అధికారులు అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సభ జరిగే సమయంలో లైవ్‌ ప్రసారాల ద్వారా సభను రాష్ట్రంలోని ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నవారు ఆసక్తిగా చూస్తారు బయట ప్రభుత్వం ఎంత విజయవంతంగా పరిపాలన అందిస్తుందో అదే తరహాలో సభలోను తన ప్రతిభను చూపాల్సిన అవసరం ఉంటుంది అందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఉభయ సభలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ధ్రువపరుచుకోకుండా మీడియాలో ఇష్టారీతిన ప్రచురణ లేదా ప్రసారం చేస్తే అది చట్టసభల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని సమావేశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారంపై సమాచార శాఖ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.
చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచేలా సభలు నిర్వహిద్దాం: మంత్రి శ్రీధర్‌ బాబు
చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచేలా ఉభయ సభలు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అందుకు అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఉండాలని ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఉదయాన్నే మీడియాలో వచ్చిన వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే మంత్రులు సమాధానం ఇచ్చేందుకు అధికారులు పూర్తి సమాచారంతో సభలో అందుబాటులో ఉండాలని మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులను ఆదేశించారు. జీరో అవర్లో సభ్యుల ప్రశ్నలకు అవసరమైన సమాధానాలు అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధం చేయాలని, పెండిరగ్‌ రిపోర్ట్స్‌, హామీలకు సంబంధించిన అంశాల పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. అసెంబ్లీ, కౌన్సిల్‌ కార్యదర్శులు ఎప్పటికప్పుడు చీఫ్‌ సెక్రటరీ కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ఏవి ప్రాధాన్యం ఉన్న అంశాలు, ఏవి అప్రధాన్యమైన అంశాలు వివరిస్తారు అందుకు అనుగుణంగా అధికారులు వేణు వెంటనే స్పందించాలని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, కౌన్సిల్‌ సెక్రటరీ నరసింహ చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి సీనియర్‌ అధికారులు వికాస్‌ రాజ్‌, దాన కిషోర్‌, జయేష్‌ రంజన్‌, రఘునందన్‌ రావు, శ్రీధర్‌, నదీమ్‌ అహ్మద్‌, శైలజ రమా అయ్యర్‌, యోగితారానా, లోకేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు .