రెండు మైనస్‌, రెండు ప్లస్‌ – కాంగ్రెస్‌లో నంబర్‌ గేమ్‌

‘పశ్చిమ’లో లక్కీ నంబర్‌ 9

ఏలూరు, జూన్‌ 16 (జనంసాక్షి) :  వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు గేమ్‌ ఆడుతూనే ఉన్నారు.  రైతులు, రైతు కూలీల విషయంలో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి జగన్‌ శిబిరంలోని 18 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటును ఎదుర్కొన్నారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.  18 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరి ఎమ్మెల్యేలను గెలుచుకుంది.  పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తూర్పుగోదావరి జిల్లా రామచ ంద్రాపురంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిద్దరు 2009ఎన్నికల్లో పీఆర్పీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన వారే. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం తరువాత దశ తిరిగి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా శాసనసభలో అడుగుపెడుతున్నారు.  గతంలో పీఆర్పీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేగా గెలుపు సాధించి అసెంబ్లీలోకి అడు గుపెడుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న  రెడ్డి ఇంతకుముందే కోవూరు స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజాగా జరి గిన ఉప ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలుపు సాధి స్తే మరో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి వైదొలగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, విజయనగరం జిల్లా బొబ్మిలి ఎమ్మెల్యే రంగారావు  ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.వీరి రాజీనామాలు స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.  వీరిద్దరు వైఎస్సార్‌ సీపీలో చేరిపోయారు. అంటే దాని ప్రకారం అధికార పార్టీ ఇద్దరి ఎమ్మెల్యేలను కోల్పోగా, వారి స్థానాల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు  ఆ లోటును భర్తీ చేయడంతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం యథాతథంగానే ఉంది.  పశ్చిమగోదావరి జిల్లాలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య బలం లక్కీ నంబర్‌ 9దే కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో మంత్రులు వట్టి వసంతకుమార్‌, పితాని సత్యనారాయణతో కలుపుకుని ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిది. ఐదు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, మరో చోట పీఆర్పీ ఎమ్మెల్యే గెలుపు సాధించారు. పీఆర్పీ విలీనంతో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈలి నాని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే జగన్‌ శిబిరంలో చేరిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టారు. దాంతో ఆ సంఖ్య 8కి పడిపోయింది.  ఎప్పుడైతే నర్సాపురం స్థానంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పీఆర్పీ విలీనం తరువాత ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు. కాంగ్రెస్‌ లక్కీ నంబర్‌ 9కి ఢోకా లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసా ద్‌రాజు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా సుబ్బా రాయుడిపై పోటీ చేసి ఓడి పోవడం కూడా మరో విశేషమే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 15 స్థానాల్లోనూ, నెల్లూరు పార్లమెంట్‌ స్థానంలోనూ వైఎస్సార్‌ సీపీ ఘన విజయంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు వలస వెళతారో అన్న విషయంపైనే మళ్లీ నంబర్‌ గేమ్‌ ఆధారపడి ఉంది.