భారత్కు యూఏఈ అధ్యక్షుడు..
స్వయంగా స్వాగతం పలికిన మోదీ
` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు
న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. కరచాలనం చేసి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. అయితే, విదేశాంగ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అల్ నహ్యాన్ కేవలం రెండు గంటలే దిల్లీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.“సోదరుడు, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. ఇరుదేశాల మధ్య స్నేహానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పర్యటన చాటుతోంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాధినేతలూ చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇరాన్` అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడం, యెమెన్ విషయంలో సౌదీ అరేబియా, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు, గాజాలో రాజకీయ అస్థిరతలు నెలకొన్నవేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యూఏఈ అధ్యక్ష హోదాలో అల్ నహ్యాన్ భారత్లో అధికారికంగా పర్యటించడం ఇది మూడోసారి. 2022లో ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనంతరం సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.



