హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలి గంగారెడ్డి డిమాండ్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30: హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాల్సిందేనని టిఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు గంగారెడ్డి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం టిఆర్‌ఎస్‌వి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థులకు భోజనం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రభుత్వం  ఇస్తున్న మెస్‌చార్జీలు 550 ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. దీన్ని 1000 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందన్నారు. హాస్టల్‌ విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు. అర్బన్‌ ఇన్‌చార్జీ ఎఎస్‌ పోశెట్టి మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌చార్జీలను పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో టిఆర్‌ఎస్‌ నాయకులు సుజిత్‌సింగ్‌ ఠాగూర్‌, డి.విల్‌రావు, చింతమోహన్‌, తదితరులు పాల్గొన్నారు