లారీని ఢీకొన్న బైక్‌..ముగ్గురు యువకుల దుర్మరణం

సంగారెడ్డి, జులై 25  (జనంసాక్షి ): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను పుల్కల్‌ మండలం గంగోజీపేటకు చెందిన సందీప్‌, నవీన్‌, అభిషేక్‌గా గుర్తించారు. ఈ ముగ్గురూ అక్షయపాత్రలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. పోలీసులు వెంటనే చేరుకుని దర్యాప్తు చేపట్టారు.