అత్యాచారానికి యత్నించిన ఖా’కీచకుల’ అరెస్టు

తిరుపతి, జూలై 6 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా కలికిరిలో గురువారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఖాకీచకులను పోలీసులు అరెస్టు చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన మహిళా కూలీలపై ఇందిరమ్మ కాలనీలో భాస్కర్‌, యూసుఫ్‌ అనే కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. మరో కానిస్టేబుల్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి మహిళలు ఇక్కడి తోటలలో కూలీలుగా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ముగ్గురు కానిస్టుబుళ్లు ఈ కూలీలను అడ్డగించి ఏం చేస్తున్నారని ప్రశ్నలతో వేధించారు. తాము కూలి పనుల కోసం వచ్చామని చెప్పడంతో వెళ్లిపోయారు. తిరిగి గురువారం తెల్లవారుజామున వచ్చి మహిళా కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మహిళలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు పరారయ్యారు. గురువారం ఉదయం స్థానికులతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఇద్దరి పోలీసులను అరెస్టు చేశారు.