అదిరిపోనున్న ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీ

5d4pg4hnక్రికెట్ అభిమానులను కనువిందు చేయడానికి ఏప్రిల్ 8న నుంచి ఐపీఎల్ సీజన్-8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు బాలీవుడ్ తారాగణం హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్కశర్మ తదితరులు తమ ఆటపాటలతో అలరించనున్నారు. ఈ నెల 7న కోల్ కతాలో ఈ ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. సీజన్-8 ఆరంభ వేడుకలకు వ్యాఖ్యాతగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ వ్యవహరిస్తారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. అంతేకాకుండా అభిమానుల ఉత్సాహాన్ని పెంచే విభిన్న వినోద కార్యక్రమాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. గత సీజన్ ఛాంపియన్స్ అయిన కోల్ కత నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తిరిగి ట్రోఫీని స్డేడియంలోకి తీసుకురానున్నారు. ప్రపంచకప్ టోర్నీని ఆస్వాదించిన క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ రూపంలో మరో సరికొత్త క్రీడా సంగ్రామం స్వాగతం చెపుతోంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 24న ముగుస్తుంది. మొత్తం 60 మ్యాచ్ లతో ఆసాంతం కనుల విందు చేయనుంది.