అనుమానాస్పదంతో సీపీఐ యువ నాయకుడు మృతి

అంతిమ యాత్రలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 14 :- అనుమానాస్పదంతో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, సీపీఐ జిల్లా నాయకులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన సీపీఐ పార్టీ ఇటిక్యాల మండల కార్యదర్శి టి. కృష్ణ మంగళవారం రాత్రి చాతినప్పుతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అనుమానాస్పదంతో మృతి చెందినట్లు వారు తెలిపారు. టి. కృష్ణ అకాల మరణంపై సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు పెద్దబాబు, రంగన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహంపై పార్టీ జెండాలు కప్పి ఘనంగా నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ టి. కృష్ణ మృతి సీపీఐ పార్టీకి తీరనిలోటని ఆయన అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. అంతిమయాత్రలో సర్పంచ్ మధునాయుడు, యూత్ ఫర్ పబ్లిక్ జిల్లా నాయకులు అర్విశేషు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహులు, ఏఐవైఎఫ్ నాయకులు పరమేష్, సీపీఐ పార్టీ నాయకుడు చెన్నయ్య, బుచ్చన్న, మహేష్, గ్రామ పెద్దలు, ప్రజలు భారీగా తరలివచ్చి నివాళులు అర్పించారు.