అఫ్ఘాన్‌లో సైన్యం ఉపసంహరణ సరైనదే

విమర్శలపై ఘాటుగా స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్‌
అమెరికా పౌరులపై దాడులు చేస్తే కఠినంగా అణచివేస్తాం
తాలిబన్లకు కూడా గట్టి బైడెన్‌ హెచ్చరికలు
వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తొలిసారి నోరు విప్పారు. శ్వేతసౌధంలో సోమవారం బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనన్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడతానన్నారు. ఈ నిర్ణయంపై చింతించడం లేదన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్‌ తెలిపారు.అక్కడి నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని జో బైడెన్‌ పేర్కొన్నారు. అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు అప్గాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అప్గాన్‌ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అప్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్దాన్ని కొనసాగించడమే అని అన్నారు. అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్‌ హెచ్చరించారు. అప్గాన్‌ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. అప్గాన్‌ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్‌ అన్నారు. అప్గాన్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్‌ డాలర్లను అందించామని.. ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయన్నారు. అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఇక ఏమాత్రం అప్గాన్‌ సంక్షోభం అమెరికా జాతీయ భద్రత ఆసక్తి కాదన్నారు. అప్గానిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, ఆ దేశ ప్రజలకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. అప్గాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అఎª`గాన్‌లో ఉన్న
అమెరికా పౌరులను తరలించనున్నట్లు బైడెన్‌ పేర్కొన్నారు. మరో దేశ అంతర్యుద్ధంలో అమెరికా పోరాడాలని తాను సైనిక బలగాలకు చెప్పనన్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని తెలుసన్నారు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో తాను నాలుగో అధ్యక్షుడినని, అయితే ఈ బలగాల ఉపసంహరణ పనిని ఐదో అధ్యక్షుడికి బదిలీ చేయదలుచుకోలేనన్నారు. 2009లో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అప్గాన్‌లో సైనిక దళాలను మోహరించడంపై వ్యతిరేకించినట్లు తెలిపారు. తాను అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదన్నారు. 2001 సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్‌ తెలిపారు. అంతేకాని అప్గాన్‌ జాతి నిర్మాణం చేయడం తమ లక్ష్యం కాదన్నారు. అప్గాన్‌ నుంచి అమెరికా దళాలు నిష్కమ్రించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక అప్గాన్‌ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. కాబుల్‌ విమానాశ్రయంలో అప్గాన్‌ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విమానాల టైర్లపై ఎక్కి ప్రయాణించి మరణించారు. ఈ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటనపై బైడెన్‌ స్పందిస్తూ ఈ దృశ్యాలు తనను కలతపెట్టాయన్నారు.
మరోవైపు అప్గాన్‌ ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను బైడెన్‌ విమర్శించారు.