అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరైన సిఎం

వధూవరులను ఆశీర్వించిన జగన్‌

అనకాపల్లి,ఆగస్టు4(జనం సాక్షి): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం.. తుని రాజా కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌నాథ్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాయకరావుపేట చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అయితే తునిలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. మంత్రి రాజా అనుచరులు, పోలీసులు షాపులన్నీ మూసి వేయించారు. శ్రావణ మాసం కావడంతో వ్యాపారం పోతోందని షాపు యజమానులు ఆవేదన చెందుతున్నారు. పాయకరావుపేటలో ఓ వివాహానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. సీఎం వెళ్లే రాజా మైదానం రూట్‌లో కూడా రాకపోకలను నిలిపివేశారు.