అమ్మ, చెల్లి పై ఆస్తుల కోసమే కోర్టులో జగన్ పిటిషన్..

ఆస్తుల వివాదంపై వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్, వైస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఈ ఏడాది ఐదు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ ఫిల్ చేయగా, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్‌ను జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి, క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్‌ పేరుతో దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు షేర్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్ వేశారు.

కేసు నెంబర్లు ఇవే..

ఈ ఏడాది సెప్టెంబర్3వ తేదీన ఫిల్ కేసిన కేసు నెంబర్ CP- 48/2024 కాగా, సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కేసు నెంబర్‌తో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్3వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెస్పాండెట్లకు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురి కోరం నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్8వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు.