అసహనం పెరుగుతున్న నేటి సమాజంలో బుద్దుని భోదనలు భారతావణికి అవసరం

బుద్ధుని సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చెరవేసేలా కృషి

బుద్ధపూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ధ్యాన మందిరం కోసం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌

 

తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని ఉద్ఘాటించారు. సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో గురువారం మహబోధి బుద్ధవిహర్‌లో జరిగిన బుద్ధపూర్ణిమ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని తెలిపారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉందని ఈ సూక్తిలో నుంచి ఎంతో స్ఫూర్తిని పొందారని చెప్పారు. ఏ పని అయినా తాను ఎంతో ధ్యానంగా చేస్తానని స్పష్టం చేశారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఒక పాఠశాలను నిర్వహించాలని తాను కోరుతున్నానని చెప్పారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయన్నారు. సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందన్నారు. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమన్నారు. బుద్ధుడి సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం మీది… అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.