ఆప్లో రోజు రోజుకు ముదురుతున్న సంక్షోభం
భూషణ్, యోగేంద్రల పట్ల కేజ్రీవాల్ విముఖం
ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం రోజు రోజుకూ ముదురుతోంది. పార్టీ రెండు వర్గాలుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్లు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పార్టీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరి తీరు పట్ల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కేజ్రీవాల్ నేతృత్వంలో..బుధవారం జరిగిన సమావేశంలో ఈ విషయం మరింత స్పష్టమైంది.
పార్టీపై తిరుగుబాటుకు దిగిన ఇద్దరు సీనియర్లను..నేషనల్ ఎగ్జిక్యూటివ్ నుంచి తప్పించాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. శనివారం జరగనున్న జాతీయ కౌక్సిల్ సమావేశాలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. దీంతో ఈ రాత్రి ఆప్ నేతలు నిర్వహించనున్న సమావేశం కీలకం కానుంది.
మరోవైపు ఆప్ సీనియర్లు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు.. జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వం నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. అంతేకాదు, తాము చేసిన డిమాండ్లపై ప్రత్యర్థి వర్గం సమాధానం ఇవ్వాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. రెండు వర్గాలుగా మారిన ఆప్ సభ్యల్ని ఒక్కటి చేసే ప్రయత్నాలు ఇంకా సజీవంగా ఉన్నాయని పీఏసీ సభ్యురాలు ఇలియాస్ అజ్మీ అభిప్రాయపడ్డారు. పార్టీలో తిరిగి సభ్యుల మధ్య ఐక్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు సభ్యలు ప్రయత్నిస్తున్నారు. కేజ్రీవాల్ డిమాండ్లకు సీనియర్లు భూషణ్, యాదవ్ లు తలొగ్గేది లేదని..వారి తరపున వాదిస్తున్న సభ్యులు అంటున్నారు. అయితే నిర్ణయాత్మక పీఏసీలోనే విభేదాలు తలెత్తడంతో…చాలా మంది సభ్యలు కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు.
ఢిల్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఓటమికి సీనియర్లు ప్రశాంత్, యోగేంద్ర ప్రయత్నించాన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేజ్రీవాల్..ముంబై, పూణెలో జరగనున్న స్థానిక ఎన్నికలకు..సీనియర్ కుమార్ విశ్వాస్ కు బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి. కేజ్రీవాల్ మద్దతుదారుల, తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు ఫలించకపోవడంతో..సీనియర్లకు ఉద్వాసన అనివార్యంగా కనిపిస్తుంది.