రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థానిక గ్రామ శివారులోని బీదర్- జహీరాబాద్ రోడ్డు మార్గంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.సమాచారం అందుకున్న హద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా చూస్తామని జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, హగ్నూర్ ఎస్‌ఐ రామానాయుడు హామీ ఇచ్చారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. అయినప్పటికి గ్రామస్తులు తమ ఆందోళన కొనసాగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.