ఆరోగ్య పరిరక్షణలో భారత్ వెరీపూర్
145వ ర్యాంక్ మనకంటే మందు చైనా(48), శ్రీలంక(71), బంగ్లాదేశ్(133), భూటాన్(134)
ముంబయి: ఆరోగ్య పరిరక్షణ విషయంలో భారత్ మరింత మెరుగుపడాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల సమస్య ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో మొత్తం 195 దేశాల్లో భారత్ 145వ స్థానంలో నిలిచింది. అయితే దీనిలోనూ భారత్కు ఊరట లభించే అంశం ఒకటుంది. 1990 నుంచి భారత్లో ఆరోగ్య రక్షణ క్రమంగా మెరుగుపడుతూ వస్తోందని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య పరిరక్షణ అందుబాటులో ఉన్న అంశంలో భారత్కు 1990లో 24.7పాయింట్లు రాగా.. 2017లో 41.2 పాయింట్లు లభించాయి. ఈ విషయాన్ని హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ సూచీ కూడా తెలియజేసింది. భారత్లో గోవా, కేరళ ఆరోగ్య పరిరక్షణ విషయంలో ముందుండగా.. అసోం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. క్షయ, గుండెజబ్బులు, టెస్టిక్యూలర్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, తీవ్రమైన మూత్రపిండ వ్యాధులను అరికట్టడంలో భారత్ బాగా వెనుకపడి ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్లో వైద్య సేవలను భారీగా విస్తరించాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.
మనకంటే మందు చైనా(48), శ్రీలంక(71), బంగ్లాదేశ్(133), భూటాన్(134) ఉండగా.. నేపాల్(149), పాకిస్థాన్(154), అఫ్గానిస్థాన్ (191) వెనుక ఉన్నాయి. ఇక టాప్-5 స్థానాల్లో ఐస్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, లక్సంబర్గ్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి.